వైభవంగా మాధవస్వామి, వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా గ్రామ తిరువీధి
మంగళహారతులతో భక్తులు స్వాగతం మాధవదార, ఫిబ్రవరి 8.. మాధవదారలో కొలువున్న మాధవస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల్లో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింహాచలం అనుబంధ ఆలయాలుగా గుర్తింపు పొందిన ఈ ఆలయాల్లో ప్రతీ ఏటా భీష్మ ఏకాదశి పర్వదినం రోజు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపధ్యంలోనే సింహాచలం ఆలయానికి చెందిన అర్చక స్వాములు, సిబ్బంది ఆయా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. తొలుత మాధవస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కళ్యాణ వేదికపై ఆశీనులను చేశారు. ఆ తరువాత విశ్వక్సేన, పుణ్యహవచనం, ఆరాధన, కంకణదారణ, నూతన యజ్ఞోపవీతం, జిలకర్రబెల్లం, మాంగళ్యదారణ, తలంబ్రాల ప్రక్రియలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. నిత్యకళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికి ఆలయ వర్గాలు తీర్ధ ప్రసాదాలు అందజేశాయి. మాధవస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే కళ్యాణ మహోత్సవాలు ముగిసిన వెంటనే మాధవదారతో పాటు పలు ప్రాంతాల్లో
ఉత్సవమూర్తులతో గ్రామ తిరువీధి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు మంగళహారతులతో స్వామిని స్వాగతించి సేవించి దర్శించుకున్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాధవస్వామిని దర్శించుకొని తిరువీధిలో పాల్గొన్నారు. భీష్మఏకాదశి నేపధ్యంలో ఆయా ఆలయాలకు ప్రత్యేక శోభ నెలకొంది.
What's Your Reaction?